ఓటు కోసం బయోమెట్రిక్ విధానం... కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

భారతదేశ ఓటింగ్ ప్రక్రియలో ఐరిస్ బయోమెట్రిక్, ఫింగర్ ప్రింట్ విధానాలను ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ అమలు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. ఈ అభ్యర్థనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది.

ఇప్పటికే కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికలు పూర్తయ్యాయి. తమిళనాడులో ఏప్రిల్ 23న... పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, ఏప్రిల్ 29న రెండు విడతల్లో ఓటింగ్ జరగనుంది. ఈ క్రమంలో ప్రస్తుత ఎన్నికలకు ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది.

రానున్న కాలంలో జరగబోయే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలకు బయోమెట్రిక్ విధానం అమలు చేయడాన్ని పరిశీలించాల్సి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ అంశంపై స్పందించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

Supreme Court of India
Biometric Voting
Indian Elections
Election Commission of India
Iris Scan

More Telugu News